
నల్లబెల్లి, నవంబర్ 11:
నల్లబెల్లి మండలం నాగరాజు పల్లి గ్రామం పరిధిలోని పంతులుపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు రాష్ట్రీయ బాల స్వస్థ్య (ఆర్ బి ఎస్ కే) కార్యక్రమంలో సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ వి.భవిత, డాక్టర్ డి.స్వర్ణలత ఆధ్వర్యంలో పాఠశాలలోని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులకు ఆరోగ్యపరంగా పలు సూచనలు చేసి, మారుతున్న వాతావరణ పరిస్థితులలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇంటి వద్ద పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ బి ఎస్ కే మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి.భవిత మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటే చదువులో రాణించగలడానికి అవకాశం ఉంటుందని, చిన్నతనం నుండే పరిశుభ్రత పాటిస్తూ పోషకాహారం తీసుకోవడం వల్ల పిల్లలు ఎదుగుదలతో పాటు జ్ఞాన సమపార్జననకు ఆరోగ్యం సహకరిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంతులుపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్ణ కంటి రామ్మూర్తి, సహోపాధ్యాయులు కూనమళ్ల రాజన్ బాబు, ఆర్ బి ఎస్ కే ఫార్మసిస్టు స్మిత, ఏఎన్ఎం జులేఖ పాల్గొన్నారు.

